విభజన చట్టం హామీలపై వెంకయ్య ఆరా
andhraprabha - Tue, 28 Oct 2014, IST
హోం, రైల్వే మంత్రులతో చర్చలు
రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష
నందలూరు, బిట్రగుంటలో సౌర విద్యుదుత్పత్తి యూనిట్లు
నివేదిక...
more... అందిన తర్వాతే రైల్వే జోన్ ఏర్పాటు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే పలు అంశాల అమలుకు సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారంనాడు కేంద్ర హోం, రైల్వే శాఖల మంత్రు లను కోరారు. విభజన చట్టంలో పొందుపరిచిన వివిధ అంశాలు, ప్రతిపాదనల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరచుగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్న వెంకయ్య నాయయుడు సూచనతో ఏకీభ వించిన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే
ఈ విషయమై హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి ఆదేశాలు జారీచేశారు. అలాగే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై మంత్రి సదానంద గౌడతో జరిపిన చర్చలలో నందలూరు, బిట్రగుంటలలో సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు, గోదావరి పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు, రాజమండ్రి, అన్నవరం స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు రైలు ప్రయాణ సౌకర్యాలను పెంపొందించేందుకు రైల్వే మంత్రి అంగీకరించారని వెంకయ్యనాయుడు కార్యాలయం నుండి విడుదలైన ఒక ప్రకటన తెలియజేసింది. హుదుద్ తుపాను విధ్వంసానికి గురైన విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లోని రైల్వే ఉద్యోగుల క్యార్టర్ల మరమ్మతుల కోసం విశాఖ డివిజన్కు అదనపు నిధులు సమకూర్చేందుకు కూడా మంత్రి అంగీకరించారు.
విశాఖ నుండి ఎపీ ఎక్స్ప్రెస్
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్న నిపుణుల కమిటీ ఈ నెలాఖరులో నివేదిక సమర్పించిన తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకొంటామని తెలిపిన రైల్వే మంత్రి సదానంద గౌడ బిట్రగుంట, నందలూరులలో రైల్వే స్లీపర్ తయారీ యూనిట్లను నెలకొల్పడం మాత్రం సాధ్యపడదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. దేశంలో ఇప్పటికే ఉన్న యూనిట్లకే ఆర్డర్లు లేనందున కొత్త యూనిట్లు ఆర్థికంగా లాభదాయకం కాబోవని పేర్కొన్న ఆయన వాటికి బదులుగా నందలూరు, బిట్రగుంటలలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనతో ఏకీభవించారు. అలాగే, గూడూరు నుండి రైల్వే వ్యాగన్లలో రోజుకు పది టన్నుల నిమ్మకాయల లోడింగ్కు కూడా మంత్రి అంగీకరించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం-న్యూఢిల్లీల మధ్య నడపాలని వెంకయ్య నాయుడు ప్రతిపాదించారు. విశాఖపట్నం నుండి ప్రారంభమయ్యే ఈ రైలుకు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ప్రాంత ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడలో మరిన్ని బోగీలు తగిలించే విధంగా ఎపీ ఎక్స్ప్రెస్ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు.
నల్లూరు జిల్లా వెంకటగిరిలో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్ర ప్రాధాన్యత కారణంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడం, తిరుపతి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి స్టేషన్గా తీర్చిదిద్దడం తదితర అంశాలను కూడా వెంకయ్యనాయుడు రైల్వే మంత్రితో చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన భూమిని అందజేయగానే తిరుపతి స్టేషన్ ఆధునీకరణ పనులను చేపడతామని, జగ్గయ్యపేట -మేళ్లచెరువు -జాన్పహాడ్ రైలు మార్గం నిర్మాణాన్ని వచ్చే ఏడాదిలో పూర్తిచేస్తామని మంత్రి గౌడ ఈ సందర్భంగా వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ప్రకటించిన గుంటూరు- విజయవాడ ప్రాంతంలో రైల్వే ప్రాతిపదిక సౌకర్యాలను గణనీయంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కూడా వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రికి వివరించినట్లు సమాచారం.