click here
విద్యుదీకరణ మార్గంలో.. తొలి రైలు.. కూత
04-12-2019 08:02:19
విజయవంతంగా నడిచిన మాచర్ల - విజయవాడ మెమూ రైలు
పర్యవేక్షించిన ఎలక్ట్రికల్ విభాగం అధికారులు
గుంటూరు,...
more... డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మాచర్ల - నడికుడి రైలుమార్గంలో విద్యుద్దీకరణ లైను సౌకర్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. తొలి ఎలక్ట్రికల్ లోకో రైలు మాచర్ల నుంచి విజయవంతంగా నడిచింది. మంగళ వారం వేకువజామున మాచర్ల రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన విజయవాడ ప్యాసింజర్ రైలు ఎలాంటి సమస్యలు లేకుండా గమ్య స్థానానికి చేరుకొన్నది. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో లోకో పైలట్లకు మెమూ రైళ్లపై శిక్షణ ఇచ్చిన తర్వాత నడిపిన తొలి రైలు కూడా ఇదే కావడం విశేషం. ఎలక్ట్రికల్ విభాగం సీనియర్ అధికారులు పర్యవేక్షించారు.
గుంటూరు - పగిడిపల్లి విద్యుద్దీకరణ మార్గంతో పాటే మాచర్ల - నడికుడి మార్గాన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసే ప్రాజెక్టుని చేపట్టారు. కొన్ని నెలల క్రితమే ఈ మార్గాన్ని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఇన్స్పెక్షన్ చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఈ మార్గంలో మెమూ రైలు నడిపేందుకు రేక్ షేరింగ్ సమస్య తలెత్తింది. 12 బోగీలతో ఉన్న మెమూ రైళ్ల కోసం డివిజన్ అధికారులు ప్రయత్నించి కాచీగూడ - పిడుగురాళ్ల మెమూ రైలుకు షేరింగ్ ఇప్పించారు. అంతేకాకుండా వేజండ్ల రైలు దుర్ఘటనని దృష్టిలో పెట్టుకొని ట్రయల్రన్ కూడా నిర్వహించారు. సీఆర్ఎస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇలా ట్రయల్రన్ నిర్వహించడం ఇదే ప్రప్రథమమని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. మంగళవారం నడిపిన తొలి ఎలక్ట్రికల్ రైలు ఎలాంటి కుదుపులు లేకుండా కొన్ని సెక్షన్లలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయా ణించింది. కాచీగూడ నుంచి పిడుగురాళ్లకి రాత్రి వేళ వచ్చే మెమూ రైలుని ప్రయాణికులు దిగిపోయిన తర్వాత వెంటనే ఖాళీగా మాచర్లకు తీసుకెళుతున్నారు. దానిని వేకువజామున మాచర్ల - విజయవాడ మెమూ ప్యాసింజర్గా నడపడం ప్రారంభించారు. అలానే సాయంత్రం వేళ విజయవాడలో బయలుదేరి రాత్రి మాచర్లకు వెళ్లే రేక్ని ప్రయాణికులు దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఖాళీగా పిడుగురాళ్లకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కాచీగూడకు నడుపుతారు. ఇలా రేక్ షేరింగ్ని సర్దుబాటు చేశారు. ఇక బీమవరం వెళ్లే ప్రయాణీకులు విజయవాడలో ఉదయం దిగిన తర్వాత వేరే డీజిల్ రైలులోకి మారాలి.